15 ఏళ్ల ప్రయత్నం – ఓనం బంపర్లో అదృష్టం
ఒనమ్ పండుగ సందర్భంగా లాటరీ టికెట్ కొన్న కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్కు అదృష్టం వరించింది. 15 ఏళ్లుగా లాటరీలు కొంటున్నా ఫలితం లేకపోయిన అతను ఈసారి ఏకంగా రూ. 25 కోట్ల బహుమతిని కొట్టేశాడు. మైసూరుకు చెందిన అల్తాఫ్, పాండవపురా పట్టణంలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇటీవల కేరళలో ఉన్న తన స్నేహితుడు ఎస్జే ఏజెన్సీ వద్ద అతని పేరుమీద ఓనం బంపర్ లాటరీ టికెట్ కొన్నాడు.
తాజాగా జరిగిన లాటరీ డ్రాలో TG43222 నంబర్ గల టికెట్కు మొదటి బహుమతి రావడంతో, రూ. 25 కోట్ల భారీ మొత్తాన్ని అల్తాఫ్ గెలుచుకున్నాడని ప్రకటించారు. ఈ బహుమతితో తన ఇంటిని నిర్మించుకోవడంతో పాటు కుమార్తె వివాహానికి ఖర్చు చేయనున్నట్టు అల్తాఫ్ తెలిపాడు.
ఇంకా పలు బహుమతులు
ఈ డ్రాలో మరో 20 మంది రూ. 2 కోట్లు బహుమతిగా పొందగా, మూడో బహుమతి కింద 20 మందికి రూ. 50 లక్షలు చొప్పున బహుమతి లభించింది. మొత్తం 71 లక్షల పైగా టికెట్లు అమ్ముడైనట్లు కేరళ లాటరీ డైరెక్టర్ అబ్రహం తెలిపారు. పాలక్కాడ్లో అత్యధికంగా టికెట్లు విక్రయించారని పేర్కొన్నారు.
తుక్కు డీలర్కి కోటీశ్వరుడి టైటిల్
ఇటీవల పంజాబ్కు చెందిన ఓ స్క్రాప్ డీలర్ అదృష్టాన్ని కొల్లగొట్టాడు. రాఖీ పండుగ సందర్భంగా రూ. 500 పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్ అతనికి రూ. 2.5 కోట్ల బహుమతిని అందించింది. జలంధర్ జిల్లాలోని ఆదమ్పూర్కు చెందిన 67 ఏళ్ల ప్రీతమ్ లాల్ జగ్గీ అనే వ్యక్తి 50 ఏళ్లుగా స్క్రాప్ డీలర్గా పని చేస్తున్నారు.
తన భార్య అనీతా జగ్గీ పేరుతో రాఖీ సందర్భంగా టికెట్ కొన్న ఆయనకు ఈసారి అదృష్టం వరించింది. మొదట న్యూస్ పేపర్లో తన టికెట్ నంబర్ 452749 చూసినప్పటికీ నమ్మలేకపోయిన జగ్గీ, లాటరీ ఏజెంట్ ఫోన్ చేసి తెలియజేయడంతో నిజమని తెలుసుకున్నాడు.