దసరా పండుగ ప్రయాణాలు: ప్రయాణికులకి తీవ్ర ఇబ్బందులు
సీట్లు ఫుల్లుగా… ఛార్జీలు రెట్టింపుగా… ప్రైవేట్ బస్సుల దోపిడీ
ఆర్టీసీ స్పెషల్ బస్సులు సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు
టికెట్ ధరల్లో అక్రమ వసూళ్లు
ప్రైవేట్ బస్సులు రెట్టింపు ధరలతో దోపిడీ
హైదరాబాద్, అక్టోబర్ 11: దసరా పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ, అవి సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
దసరా పండుగ సమయం అందరికీ ఆనందకరమైన పూట కావాలి గానీ, ప్రయాణికులకి మాత్రం ఈ పండుగ పూట ప్రయాణాలు బీభత్సంగా మారాయి. సొంతూర్లకు వెళదామంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినా సమయానికి బస్సులు రాకపోవడం, ప్రైవేట్ బస్సులు ఛార్జీలను రెట్టింపు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్టీసీ స్పెషల్ బస్సులు – సర్వీస్ తక్కువ, సమస్య ఎక్కువ
ప్రయాణికులు సాధారణంగా ఎక్కిన స్టాప్ నుంచి టికెట్ కొట్టాలి. కానీ ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఎక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందో, అక్కడి నుంచే ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, జనగామ, యాదాద్రి, వరంగల్ వెళ్ళే ప్రయాణికులు ఉప్పల్ నుంచే బస్సు ఎక్కినా, జేబీఎస్ నుంచే టికెట్ ధర వసూలు చేస్తున్నారు. ఇది సగటు ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారుతోంది.
ప్రైవేట్ బస్సుల దోపిడీ
విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులపై ఆర్థిక భారం వేస్తున్నాయి. సాధారణంగా విజయవాడకు ₹450 ఛార్జీ ఉండగా, ప్రస్తుతం ₹600-₹700 వరకు వసూలు చేస్తున్నారు. కాకినాడకు ₹800 ఉండగా, ఇప్పుడు రూ.1,200 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
బస్సుల్లో బ్రేక్డౌన్ సమస్యలు
దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్ విచారణ కేంద్రాల హెల్ప్డెస్క్ నంబర్లకు ఫోన్ చేస్తే అధికారులు స్పందించకపోవడం, మార్గ మధ్యలో బస్సులు బ్రేక్డౌన్ కావడం వంటి సమస్యలు కూడా ప్రయాణికులను వేధిస్తున్నాయి. పండుగ పూట ప్రయాణం భయపడే స్థాయికి చేరింది.