అక్షర న్యూస్ :భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఇవాళ రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయన… పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ వయసు 92 సంవత్సరాలు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా వ్యవహరించి యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలను నడిపించారు. 13వ భారత ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్… దేశంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుపొందారు. దేశంలో అనేక ఆర్థిక సంస్థరణల రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982-85 మధ్య కాలంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా వ్యవహరించారు.
మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు పాకిస్థాన్ లో 1932 సెప్టెంబరు 26న జన్మించారు. విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చేసింది. మన్మోహన్ సింగ్ కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు (ఉపీందర్, దమన్, అమృత్ సింగ్) ఉన్నారు.