అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం పెద్ద తండా గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న – ప్రజా పాలన’ కార్యక్రమాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.05 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.20 లక్షలతో పూర్తయిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటివరకు మంజూరైన రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో కలిసి ప్రజల సమక్షంలో సమీక్ష చేపట్టారు. 75 మందికి పెన్షన్లు, 10 ఇందిరమ్మ ఇళ్లు, 79 కుటుంబాలకు గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం కింద రూ.500 కే గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా కింద 226 మందికి రూ.28.33 లక్షలు, 192 కొత్త రేషన్ కార్డుల పంపిణీ సహా SHG రుణాల వివరాలను వెల్లడించారు. జలసిరి కింద ప్రతి ఇంట్లో రూ.6,500 సాయంతో ఇంకుడు గుంతలు, పంట కుంటలకు రూ.1.30 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, భూగర్భ జలాల పెంపునకు నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నర్మేట వద్ద ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉన్నందున ఎకరాకు రూ. లక్ష ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మళ్లాలని సూచించారు. క్లియరెన్స్ వచ్చిన గౌరవెల్లి ప్రాజెక్ట్ను త్వరలోనే పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని, ఈ నెల 31 వరకు వివిధ వర్గాల అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ నివారణకు 300 స్టీల్ బ్యాంక్ కిట్లు పంపిణీ చేశామని, రామవరాన్ని సోలార్ మోడల్ విలేజ్గా మారుస్తున్నామని స్పష్టం చేస్తూ, ప్రజలు కోరిన జీపీ భవనం, తాగునీరు, సీసీ రోడ్లు, క్రీడా కిట్ల సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.


