అక్షర న్యూస్ :తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు.
SIR ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారని, గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 2,64,87,214 మంది వివరాలతో ముసాయిదా జాబితాను రూపొందించినట్లు తెలిపారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ అనంతరం రాష్ట్రంలో 78.03 శాతం మంది ఓటర్ల వివరాలు ముసాయిదా జాబితాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తమ పేరు జాబితాలో లేకపోతే సంబంధిత ఫారం-6A ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో సూచించారు.
జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలియాలి అంటే ఈ లింక్ క్లిక్ చేసి చూసుకోండి….
SIRలో మరో కీలక అంశంగా 73 లక్షల మంది ASD (Absent, Shifted, Duplicate) జాబితాలో ఉన్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అన్మ్యాప్డ్ జాబితాలో ఉన్న సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నోటీసులు బూత్ లెవల్ అధికారులు (BLOలు) పోస్టు ద్వారా పంపించనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరణను సమర్పించేందుకు సెప్టెంబర్ 16 వరకు అవకాశం ఉంటుంది.
ముసాయిదా విడుదలకు ముందు ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం సహా ఇతర పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. SIR తదుపరి దశలో రాజకీయ పార్టీలు చేపట్టాల్సిన చర్యలు, అభ్యంతరాల ప్రక్రియపై సీఈవో వారికి వివరించారు.
ఇక ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారిలో కొందరి వివరాలు గత 2002 SIR రికార్డులతో సరిపోలకపోవడం కూడా అధికారుల దృష్టికి వచ్చింది. సుమారు 32.36 లక్షల మంది తమ ఫారాల్లో 2002 SIR వివరాలను లేదా కుటుంబ సభ్యుల వివరాలను ప్రస్తావించలేదని, అలాంటి వారిని ‘అన్మ్యాప్డ్’ కేటగిరీలో చేర్చి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోవైపు, సుమారు 61 లక్షల మంది 2002 SIR వివరాలను ఫారాల్లో పేర్కొన్నప్పటికీ అవి సంబంధం లేని లేదా సరిపోలని వివరాలుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరిని ‘అనామలీస్’గా పరిగణించి వివరణ కోరేందుకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాలు, వివరణల స్వీకరణ ప్రక్రియ ముసాయిదా విడుదలైన నాటి నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతుంది.
నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకదాన్ని ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటర్లు ఇచ్చిన సమాచారం, సమర్పించిన పత్రాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROలు) పరిశీలిస్తారు. విచారణ అనంతరం వివరాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలితే సంబంధిత వ్యక్తుల పేర్లను తుది ఓటర్ల జాబితాలో కొనసాగిస్తారు లేదా చేర్చుతారు.
SIR ప్రక్రియలో భాగంగా నోటీసులు, అభ్యంతరాలు, విచారణలు పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఓటరూ వెంటనే పరిశీలించుకోవడం కీలకంగా మారింది. నోటీసులు అందిన వారు సెప్టెంబర్ 16లోపు స్పందించి, అవసరమైన పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు.
