అక్షర న్యూస్ :సిద్దిపేట నగర పరిధిలోని వేములవాడ కమాన్ సమీపంలో గల శ్రీ రాజరాజేశ్వరి దాబాను శనివారం మున్సిపల్ మరియు టూ టౌన్ పోలీస్ అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు.
రాత్రి సుమారు 09:30 గంటల సమయంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తో కలిసి నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా హనుమాన్ నగర్లోని రాజరాజేశ్వరి దాబాలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తుండటాన్ని కమిషనర్ స్వయంగా గుర్తించారు.
అదే రోజు రాత్రి దాబా యజమాని పోదేన్ల దశరథంతో పాటు మద్యం సేవిస్తున్న ఇతర వ్యక్తులపై సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, ఈరోజు (07.02.2026) సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ ఆశ్రీత్ కుమార్ గారు మరియు టూ టౌన్ పోలీసులు కలిసి సదరు దాబాను అధికారికంగా సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సిద్దిపేట్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ.. సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దాబాలలో ఎవరైనా అక్రమంగా మద్యం వ్యాపారం చేసినా, సిట్టింగ్ ఏర్పాటు చేసినా లేదా బెల్ట్ షాపులు నిర్వహించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
