• Tue. May 5th, 2026

అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్

Bypentam swamy

May 5, 2026

అక్షర న్యూస్ :“మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమంలో భాగంగా కోహెడ గ్రామాన్ని సందర్శించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీమతి రష్మీ పెరుమాల్, IPS గారు

సిద్దిపేట జిల్లా ప్రజలు మరియు పోలీసుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, స్నేహపూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా చేపట్టిన “మన పోలీస్ – మన ఊరు” కార్యక్రమంలో భాగంగా నేడు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీమతి రష్మీ పెరుమాల్, IPS గారు కోహెడ గ్రామాన్ని సందర్శించారు.

గ్రామానికి విచ్చేసిన సీపీ గారికి గ్రామ మహిళలు కోలాటాలతో, కళాకారులు సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా సీపీ గారు పలు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా కోహెడ పోలీస్ స్టేషన్‌లో 30 సీసీటీవీ కెమెరాలు మరియు సెంట్రల్ మైక్ సిస్టమ్‌ను సీపీ గారు ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. తర్వాత స్థానిక పోలీసుల సహకారంతో ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన రన్నింగ్ ట్రాక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నిబంధనలు పాటించడం మరియు మాదకద్రవ్యాల వ్యతిరేకత అంశాలపై నిర్వహించిన ముగ్గుల పోటీలను పరిశీలించారు. లక్ష్మీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వృద్ధులకు చేతికర్రలను పంపిణీ చేశారు.

గ్రామస్థులకు హెల్మెట్లను పంపిణీ చేయగా, యువత క్రీడల్లో రాణించేందుకు 30 మంది గ్రామ పెద్దలకు వాలీబాల్ కిట్లను అందజేశారు. పోలీస్ బృందం మరియు కోహెడ గ్రామ యువత మధ్య స్నేహపూర్వక వాలీబాల్ మ్యాచ్ నిర్వహించబడింది.

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

ఒగ్గు కళాకారులు ట్రాఫిక్ నిబంధనలను కథారూపంలో వివరించగా, పోలీస్ కళాబృందం డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను పాటల ద్వారా తెలియజేశారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సీపీ గారి ప్రసంగం – ముఖ్యాంశాలు

ఈ సందర్భంగా సీపీ గారు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ:

“ఏప్రిల్ 1న ప్రారంభమైన ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత వారం అకునూర్ గ్రామాన్ని సందర్శించాము, నేడు కోహెడ గ్రామాన్ని సందర్శించడం ఆనందంగా ఉంది. పోలీసులు బయట వ్యక్తులు కాదు, ‘మన పోలీస్’ అనే భావన ప్రజల్లో కలగాలి.”

గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. వృద్ధుల నిర్లక్ష్యం, డ్రగ్స్ వినియోగం, మద్యం అలవాటు వంటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటూ, గ్రామస్థులతో కలిసి వాటికి పరిష్కారం కనుగొంటామని తెలిపారు.

అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..

ఒగ్గు కథలు, పాటలు, వీడియోల ద్వారా ట్రాఫిక్ నియమాలు మరియు మద్యం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు వస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాకుండా, సమాజంలో మంచి విలువలను పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

గ్రామ పెద్దలు యువతను సరైన దారిలో నడిపించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎ.ఆర్. సుభాష్ చంద్రబోస్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, హుస్నాబాద్ సీఐ శ్రీను, కోహెడ ఎస్‌ఐ అభిలాష్, పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.