• Tue. Mar 3rd, 2026

అక్షర న్యూస్ :హైదరాబాద్‌కు నిరంతరాయంగా నీరు..

Bypentam swamy

Jan 6, 2026

అక్షర న్యూస్ :భాగ్యనగర ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జలమండలి (HMWSSB) ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. నగరానికి నిరంతరాయంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నీటిని సరఫరా చేసే లక్ష్యంతో ఏకంగా రూ.8,000 కోట్ల అంచనా వ్యయంతో భారీ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెంబడి ఒక వాటర్ రింగ్ మెయిన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) కూడా పూర్తయింది. త్వరలోనే దీన్ని పరిపాలన, ఆర్థిక అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుత సమస్యలకు శాశ్వత పరిష్కారం
ప్రస్తుతం హైదరాబాద్‌లో పాక్షికంగా లీనియర్ పైప్‌లైన్ వ్యవస్థ అమల్లో ఉంది. దీనివల్ల ప్రధాన పైప్‌లైన్‌లో ఎక్కడైనా మరమ్మతులు వచ్చినా లేదా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా, ఆ లైన్‌పై ఆధారపడిన లక్షలాది మందికి గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి నీటి సరఫరా నిలిచిపోతోంది. ఉదాహరణకు, ఎల్బీ నగర్ జోన్‌లోని కొన్ని ప్రాంతాలు అక్కంపల్లి రిజర్వాయర్‌పైనే ఆధారపడటంతో 3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని పొందుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించి, నగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఈ రింగ్ మెయిన్ వ్యవస్థను ప్రతిపాదించారు. కోటిన్నర జనాభాకు చేరువవుతున్న నగరానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది.

అక్షర న్యూస్ : పదవి విరమణ చేసిన తెలుగు పండితులు శ్రీ పి కనకరాజ్…

ప్రాజెక్ట్ స్వరూపం ఇదే
ఈ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్ చుట్టూ 140 కిలోమీటర్ల పొడవునా ప్రధాన పైప్‌లైన్ (రింగ్ మెయిన్) నిర్మిస్తారు. దీనికి అనుబంధంగా, ఓఆర్ఆర్‌కు సమీపంలోని అంతర్గత ప్రాంతాలకు నీటిని చేరవేసేందుకు 98 కిలోమీటర్ల పొడవైన రేడియల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ ద్వారా నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఐదు ప్రధాన వనరులైన గోదావరి, కృష్ణా, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను పరస్పరం అనుసంధానిస్తారు.

“ఈ అనుసంధానం వల్ల నగరంలోని ఏ ప్రాంతమూ కేవలం ఒకే నీటి వనరుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఒక మార్గంలో సరఫరాకు అంతరాయం కలిగితే, తక్షణమే మరో మార్గం నుంచి నీటిని మళ్లించి సరఫరాను స్థిరీకరించవచ్చు. ఇది మొత్తం సరఫరా వ్యవస్థకు భరోసా ఇస్తుంది” అని జలమండలికి చెందిన ఒక సీనియర్ అధికారి వివరించారు. ఇదే సమయంలో, మంజీరా, ఉస్మాన్‌సాగర్ సరఫరా నెట్‌వర్క్‌ల ఆధునికీకరణకు రూ.1,000 కోట్లతో పనులు చేపడుతున్నామని, దీనివల్ల నీటి నష్టాలను తగ్గించి, నాణ్యతను పెంచవచ్చని ఆయన తెలిపారు.

అక్షర న్యూస్ :అనుమానాస్పద స్థితిలో వాటర్ ఆపరేటర్ మృతి ..

ఈ డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. గోదావరి ఫేజ్-II ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే 2027 నాటికి ఈ రింగ్ మెయిన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని జలమండలి లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థలో ఇదొక విప్లవాత్మక మార్పు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.